వాహన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ ట్యాంపర్ ప్రూఫ్ నంబర్ ప్లేట్లు ఉండాల్సిందేనని తెలిపింది. ఈ విషయాన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే వాటిపై అధికారిక హోలోగ్రామ్ కలిగిన స్టిక్కర్ కూడా ఉండాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 చట్టంలోని, హెచ్ఎస్ఆర్పీ ఆర్డర్స్ 2001 సవరించడం ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, జూన్ 5వ తేదీ 2018న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని నితిన్ గడ్కరీ చెప్పారు.
రాష్ట్రాల రవాణాశాఖలు, ఆటోమోటివ్ రీసెర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, సెంట్రల్ రోడ్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరై ఈ ప్రతిపాదనను ఆమోదించారని నితిన్గడ్కరీ తెలిపారు. కాబట్టి ఏప్రిల్ 1, 2019 నుంచి వాహనదారులందరూ హైసెక్యూరిటీ ట్యాంపర్ ప్రూఫ్ నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని గడ్కరీ హెచ్చరిక చేశారు.