రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రభుత్వం ఎదుర్కొన్న ఇబ్బందులపై ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తోన్నసంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎనిమిది శ్వేతపత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి.. ఇవాళ పరిశ్రమలు, ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్పై తొమ్మిదో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు.
పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పన ఏపీ సీఎం చంద్రబాబు తొమ్మిదో శ్వేతపత్రం విడుదల చేశారు. వీటిపై 10.5శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. 2013లో కరెంట్ లేక పరిశ్రమలు మూతపడ్డాయన్న ఆయన.. కేంద్రం నిర్లక్ష్యం చేసినా ప్రగతి సాధించామన్నారు. 12 పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చామని, సింగిల్ విండో ద్వారా కంపెలనీలకు అనుమతులు ఇచ్చామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మూడు లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు.
ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు రావాలంటే టూరిజం అభివృద్ది చెందాలని చంద్రబాబు తెలిపారు. విద్యుత్ సరిగా సరఫరా లేని కారణంగా నాడు ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, పెట్టుబడులు సైతం ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో విశాఖ నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి ప్రస్తావించినప్పటికీ ఆ ప్రాజెక్ట్కు కాకుండా ఢిల్లీ-ముంబై పారిశ్రామిక క్యాడర్కు నిధులను కేటాయించారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.