పశువులే గొప్పసంపద.. అందుకే కనుమ పండుగ

పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! “సంక్రాంతి” లక్ష్మీని ఆహ్వానిస్తూ ఈ పండగలో మూడవ రోజు కనుమ అని పశువుల పండుగ. పంట పొలాల నుండి తమ ఇంటికొచ్చిన పంటను భారతీయ హిందూ ధర్మం ప్రకారం ఒక గొప్పనైన సంస్కృతి ఆచరిస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక, పశువులు, పక్షులతో పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు.

పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తమకి సుఖసంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తోన్న పాత్రను రైతులు మరిచిపోరు.

తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్లు పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు. ఆ పశువుల నుదుటున పసుపు, కుంకుమదిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు.

వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు. ఈ పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి కార్యక్రమము చేస్తుంటారు.

leave a reply