దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారుపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. నరేలా ప్రాంతానికి బయలుదేరిన సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు ఒక్కసారిగా వచ్చిన కొందరు ఆందోళనకారులు కేజ్రీవాల్ కారుపై కర్రలతో దాడి చేయడంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ కొన్నిఅభివృద్ధి పనులు ప్రారంభించేందుకు శుక్రవారం సాయంత్రం నరేలా ప్రాంతానికి బయలుదేరగా మార్గమధ్యలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపుగా 100 మంది ఆందోళనకారులు సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరిలో కొంతమంది కర్రలతో కారుపై దాడి చేసినట్లు సీఎంవో కార్యాలయం అధికారులు తెలియచేసారు.
అయితే ఈ దాడికి సంబంధించి… భాజపా కార్యకర్తలే పాల్పడినట్లు ఆప్ వర్గాలు అనుమానం వ్యక్తం చేసారు. అయితే ఈ ఆరోపణలను భారతీయ జనతాపార్టీ కొట్టిపారేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.