కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ లో మార్పులు చేసింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కొంతమంది విమర్శిస్తున్నారు. అయితే.. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం కోటా కల్పిస్తున్నట్లు సమాచారం. వార్షిక ఆదాయం అతి తక్కువ ఉన్న వారికి రాజ్యాంగ సవరణ మేరకు బిల్లును రేపు కేంద్రం పార్లమెంట్లో పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ బిల్లు కోసం రేపటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలను రెండు రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16లకు సవరణలు చేయవలసి వస్తుంది.
ఈబీసీ రిజర్వేషన్ అంశం గురించి ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్ స్పందించారు. ఈబీసీ రిజర్వేషన్ ఎప్పటినుంచో చర్చనియాంశంగా ఉందని, వాజ్పేయి ప్రభుత్వం కంటే ముందునుంచే ఉందన్నారు. అగ్రకులాల్లో కాపులు, పటేళ్లు, గుజ్జర్లు, జాట్లు నుంచి రిజర్వేషన్ల కోసం డిమాండ్లు వస్తున్నాయని, అగ్రకులాల్లో ఉన్న పేదలు నిరుద్యోగసమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని. వారికి రిజర్వేషన్ కల్పించడం పరిణామమేనని చెప్పుకొచ్చారు. అయితే కేవలం ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం హడావుడి చేయకుండా.. ఆ రిజర్వేషన్లు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.