హైదరాబాద్ : ఖైతరాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో ఇంధన పొదుపు అవార్డుల ప్రదానంతో పాటు. రాష్ట్ర పునరుద్ధరణీకరణకు ఇంధన వనరుల సంస్థ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. అంతేకాకుండా ఆయనతో పాటు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, విద్యుత్ రంగ నిపుణులు పాల్గొన్నారు. ఇంధన పొదుపు పాటించిన ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు గవర్నర్ అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే తెలంగాణ విద్యుత్ సమస్యను అధిగమించిందని, సౌర విద్యుత్ వినియోగం పెంచాలని, అభివృద్ధికి విద్యుత్ ఎంతో కీలకం. ప్రత్యామ్నాయ విధానాలపై ఆధారపడాలని గవర్నర్ సూచించారు. సౌర విద్యుత్ వల్ల పర్యావరణ పరిరక్షణే కాకుండా చాలా లాభాలున్నాయని తెలిపారు. విద్యుత్ కొనుగోలుపై ఆధారపడకుండా.. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవాలని గవర్నర్ సూచించారు. రాజ్ భవన్ లో 100 శాతం సౌర విద్యుత్ నే వినియోగిస్తున్నామని నరసింహన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని గవర్నర్ తెలిపారు.