ఎట్టకేలకు శబరిమల అయ్యప్పస్వామిని ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారు జామున దర్శించుకున్నారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటుచేసిన భారీ భద్రత నడుమ వారు వీఐపీ బ్రేక్లో దర్శనం చేసుకున్నారు. అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్లు లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి.
బుధవారం తెల్లవారుజామున తాము అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నట్లు కోజికోడ్ జిల్లాకు చెందిన బిందు(42), కనకదుర్గ(44) అనే ఇద్దరు మహిళలు వెల్లడించారు. ‘‘మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మేం పంబ చేరుకున్నాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదు. పోలీసుల భద్రత మధ్య మేము సన్నిధానానికి వచ్చాము. కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేదు”. మేము స్వామిని దర్శనం చేసుకున్నామని బయటకు వచ్చి మీడియాకి తెలిపారు బిందు, దర్గలు.
అయితే.. వీరిద్దరూ హడావుడిగా శబరిమల ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. వీరు నిజంగా దర్శనం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు ఈ ఘటనపై అయ్యప్ప దర్శ సేన నాయకుడు రాహుల్ ఈశ్వర్ స్పందించారు. మహిళలు దర్శనం చేసుకున్నారంటే నమ్మకం కలగడం లేదని, ఒకవేళ వాళ్లు రహస్యంగా వెళ్లినట్లు తెలిస్తే మాత్రం మేం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా.. మహిళలు వెళ్లి వచ్చిన తరువాత ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయాన్ని సంప్రోక్షణ పేరుతో మూసివేయడం ఇంకా వివాదాస్పదమవుతుంది.