బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని తెలుగులో హీరోయిన్ గా భారీ పాపులారిటీ తెచ్చుకుంది. భరత్ అనే నేను సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన కియారా తన తరవాతి చిత్రం చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
కియారా ముచ్చటగా మూడో సినిమాకు కూడా సంతకం చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ‘భరత్ అనే నేను’ సినిమాను విడుదల చేయక ముందే కియారా ‘వినయ విధేయ రామ’ చిత్రానికి సంతకం చేశారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధంగా ఉండగానే ఇపుడు తాజాగా మూడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్వరలో ఓ చిత్రం రాబోతుండగా ఈ చిత్రానికి హీరోయిన్ గా కియారా నటించనుందట.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ నెలలోనే సినిమాను ప్రారంభించబోతున్నారు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి హిట్ సినిమాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.