బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు వడ్డేపల్లిలో ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక రాష్ట్రం మనదేనని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో పోరాడుతున్నామని, ఇప్పటికే 63 శాతం పూర్తయిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసినట్టు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నట్టు సీఎం వివరించారు.
అలాగే.. తానేదో ఆక్రోశంలో ఉన్నానని ప్రధాని మోడీ వ్యాఖ్యానించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. గుజరాత్ను, ఏపీ ఎక్కడ మించిపోతుందేమోనన్న ఆక్రోశం మోడీదని ఎద్దేవాచేశారు. అందుకే రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అక్కసు వెల్లగక్కారని చంద్రబాబు విమర్శించారు. హుందాతనం లేకుండా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఎక్కడ నిలదీస్తారో అని రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారని మండిపడ్డారు.