సముద్రంలో ప్రయాణం.. త్వరలో..!

భారత్‌కు అండర్‌వాటర్‌ రైలు

భారతీయులకు సముద్రం మధ్య నుండి ప్రయానించే అరుదైన అవకాశం రాబోతుంది.  యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్(యూఏఈ)‌ నుంచి భారత్‌ వరకు అండర్‌వాటర్‌ హైస్పీడ్‌ రైలును తీసుకొచ్చేందుకు రెండు దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. యూఏఈలోని ఫుజురాయ్‌ నగరం నుంచి ముంబయి వరకు నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే యోచన చేస్తున్నట్లు యూఏఈకి చెందిన నేషనల్‌ అడ్వైజర్‌ బ్యూరో కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్‌షేహి వెల్లడించారు. అదే విషయాన్ని సదరు కంపెనీ ఈ మేరకు దుబాయ్‌కు చెందిన ఖలీజ్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లోని ముంబయి నుంచి ఫుజురాయ్‌ నగరాన్ని కలుపుతూ నీటి అడుగున హైస్పీడ్‌ రైలును తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుందని, భారత్‌ నుంచి ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడనుందని తెలిపారు.

నీటి అడుగున సొరంగ మార్గం నిర్మించి దాని ద్వారా రైలు నడిచే విధంగా ఏర్పాటు చేయనుండగా, దాదాపు 2000 కిలోమీటర్ల మేర ఈ రైలు నెట్‌వర్క్‌ ఉండనుంది. ప్రయాణికులతో పాటు ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు సులభతరం అయ్యే విధంగా ఈ రైలు ప్రాజెక్టును రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా, ఇప్పటికే ఇటువంటి రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా, జపాన్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, ఇజ్రాయెల్‌, బ్రిటన్‌ వంటి దేశాలు కూడా ఇటువంటి రైల్వే వ్యవస్థను తీసుకురావాలనే యోచన చేస్తున్నాయి.

leave a reply