హీరో సంచలన వ్యాఖ్యలు

హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు మరోసారి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చుక్కల భూముల పేరుతో కుట్రకు తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పాలని కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చుక్కల భూములను ఈస్ట్‌ ఇండియా కంపెనీ రెగ్యులరైజ్‌ చేసిందన్నారు. ఆ ఫైల్‌ను కొంతమంది అధికారులు తొక్కిపెట్టారని హీరో శివాజీ వ్యాఖ్యానించారు. 

కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శివాజీ తెలిపారు. అంత ఇష్టముంటే రాజీనామా చేసి విపక్షపార్టీలో చేరాలని ఆయన సూచించారు. విపక్షానికి ప్రజాసమస్యలు పట్టవని.. వారికి కావాల్సింది సీఎం కుర్చీనేనని విమర్శించారు. చుక్కల భూములపై మంత్రులను అధికారులు లెక్కచేయడం లేదని వ్యాఖ్యానించారు. చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడకు అవకాశంగా మారిందని శివాజీ ఆరోపించారు.

గట్టిగా మాట్లాడితే భూములు లాక్కుంటామని కలెక్టర్‌ బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ భూములు కలెక్టర్‌ అబ్బ సొత్తా అని ప్రశ్నించారు. సీఎం బతిమిలాడుతున్నా కలెక్టర్లు వినడం లేదన్నారు. ప్రజలను టార్గెట్‌ చేసిన అధికారుల గల్ల పట్టుకుని అడుగుతానన్నారు. అన్ని ఆధారాలను సీఎం చంద్రబాబుకు అందజేస్తానని చెప్పారు. సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని శివాజీ అన్నారు.

leave a reply