అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. కొలిర్విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి నలుగురు మృతిచెందారు. వీరిలో నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండా గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయక్, సుజాత నాయక్ కుమార్తెలు సాత్విక నాయక్ (16), జ్వాయి నాయక్ (13), కుమారుడు సుహాస్ నాయక్ (14) దుర్మరణం పాలయ్యారు. వీరు చదువుకొనేందుకు అమెరికా వెళ్లినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఇంటికి అలంకరణ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నవయసులోనే దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
కాగా.. ముగ్గురూ మిసీసీపీలోని ఓ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. స్కూలుకు శీతకాల సెలవులు ఇచ్చినా పిల్లలు తమ స్వదేశం భారత్కు వెళ్లకపోవడంతో చర్చి నడుపుతున్న క్రౌడ్రెట్ కుటుంబం వారిని తమ ఇంటికి ఆహ్వానించింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇంటిని అలంకరిస్తుండగా ప్రమాదం జరిగిందని అక్కడి చర్చి ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో చర్చి నడుపుతున్న మహిళ కారీ క్రౌడెట్ మృతిచెందగా.. ఆమె భర్త డేనియల్ కౌడ్రెట్, చిన్న కొడుకు కోల్ గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న శ్రీనివాస్ నాయక్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి అమెరికా పయనమయ్యారు. మృతదేహాలను స్వదేశం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.