ఆంధ్రప్రదేశ్‌లో.. సిలికాన్‌ సిటీ!

హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను సృష్టించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో సిలికాన్‌ సిటీని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు-తిరుపతి-చెన్నైలనుకలుపుతూ ఏర్పాటు కానున్న పారిశ్రామికవాడకు (ఇండస్ట్రియల్‌ కారిడార్‌)కు సిలికాన్‌సిటీ అని పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తిరుపతిలో టీసీఎల్‌ సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు. రూ.2,200 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 60 లక్షల టీవీలు తయారు చేసే ప్రణాళికతో ఈప్లాంటును నిర్మిస్తున్నారు.

8 వేల మందికి ఇందులో ఉపాధి కల్పించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ఏపీ హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌గా మారబోతోంది. ఈరంగంలో ఇప్పటి వరకూ 59 కన్నా ఎక్కువ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించాం. వీటి ద్వారా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. ఒక్కచిత్తూరు జిల్లాలోనే 20 వేల ఉద్యోగాలు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగాలు ఈ జిల్లాలోనే ఇస్తున్నాం. ప్రపంచంలోనే పారిశ్రామిక నగరంగా షెంజెన్‌ నగరానికి పేరుంది. ఇలాంటి పారిశ్రామిక వాతావరణాన్నేఇప్పుడు మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. భవిష్యత్తులో నెల్లూరు-తిరుపతి-చెన్నై మంచి ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా మారబోతోంది. దీనికి సిలికాన్‌ సిటీగా నామకరణం చేస్తున్నాం. భవిష్యత్తులో షెంజెన్‌, సిలికాన్‌ సిటీ కలిసి పని చేస్తాయి.

ఈ ప్రాంతంలో రూ.22వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. టీసీఎల్‌ సంస్థనిర్మాణం పూర్తి చేసేందుకు మేం తొమ్మిది నెలలు సమయం అడిగాం. కానీ ఎనిమిది నెలల్లోనే పూర్తి చేస్తామని టీసీఎల్‌ ఛైర్మన్‌ ముందుకొచ్చారు. ఇందుకు వారికి అభినందనలు. డిసెంబరు 2019 నాటికే ఉత్పత్తి చేసేలా సంస్థ నిర్మాణం చేస్తోంది. ఈ సిలికాన్‌ కారిడార్‌లోనే చక్కని వాతావరణ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్లు‌,విమానాశ్రయాలు, రోడ్డు మార్గాలు వంటి సకల సదుపాయాలు ఉన్నాయి. నాలుగేళ్లకు ముందు ఈ ప్రాంతంలో ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే ఈ ప్రదేశం ఒక కారిడార్‌గా మారిపోయింది. త్వరలోనే ఇక్కడికి రిలయన్స్‌ సంస్థ వస్తుంది.

 తిరుపతి, చెన్నైలో ఇప్పటికే విమానాశ్రయం ఉంది. నెల్లూరులో త్వరలో రాబోతోంది. సిలికాన్‌ సిటీకి దగ్గరలోనే కృష్ణపట్నం, చెన్నై పోర్టులు ఉండగా.. దుగ్గరాజపట్నం, రామాయపట్నం పోర్టులు త్వరలో రానున్నాయి. సిలికాన్‌ కారిడార్‌ నుంచి ఏ వైపునకు వెళ్లాలన్నా రోడ్డు సౌకర్యం ఉంది. సమీపంలోనే జలాశయాలు కూడా ఉండడంతో జల వనరులు కూడా పుష్కలంగా ఉండనున్నాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

leave a reply