దినేష్ కార్తీక్ ఇక అవసరం లేదా!

ఆస్ట్రేలియాతో స‍్వదేశంలో జరగబోయే  ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా టీ20లకు, వన్డేలకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్లో వరల్డ్‌కప్‌ జరుగనున్న నేపథ్యంలో వన్డే జట్టుపై కొంత ఆసక్తి నెలకొంది. అయితే ఆసీస్ తో జరగబోయే సిరీస్‌లో దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఈ సిరీస్ అనంతరం టీమిండియాకు ఇంకా మ్యాచ్లు లేకపోవడంతో ఈ జట్టే వరల్డ్ కప్ ఫైనల్ జట్టని తెలుస్తుంది. ఇప్పటికే పలువురు క్రికెట్‌ ప్రముఖులు దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేయకపోవడాన్ని ఖండించగా, ఫ్యాన్స్‌ కూడా అతనికి అండగా నిలుస్తున్నారు.  గతేడాదిగా నిలకడగా రాణిస్తున్న కార్తీక్‌ను తీసేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.అయితే కార్తీక్ కి ఇంకా దారులు మూసుకుపోలేదని సెలెక్టర్లు చెబుతున్న అతను ప్రపంచకప్ లో ఆడే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు.

ఇక మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చినా అంతగా రాణించలేకపోయాడని, రాహుల్‌ను ఎలా ఎంపిక చేశారని అభిమానులు నిలదీస్తున్నారు. ” దినేశ్‌ కార్తీక్‌, రాహుల్‌లో ఎవరికి ఓటేస్తారు అంటే’ కచ్చితంగా కార్తీక్‌ వైపే మొగ్గు చూపుతారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఫామ్‌ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి కానీ ఫామ్‌లో లేని ఆటగాడ్ని జట్టులోకి తిరిగి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా కార్తీక్‌కు ఇది కష్ట సమయంగా పేర్కొన్నాడు. అయితే ఇది వరల్డ్‌కప్‌ నుంచి దినేశ్‌ కార్తీక్‌ తప్పించే క్రమంలో సెలక్టర్లు తీసుకున్న ఫైనల్‌ నిర్ణయం కాదనే తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

leave a reply