టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనిఫై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఇటీవల ఓ అభిమాని ధోని గురించి స్పందించాలని ఐసీసీని కోరగా… దీనికి స్పందిస్తూ వికెట్ల వెనకాల ధోని ఉన్నప్పుడు క్రీజ్ను దాటే సాహసం చేయకపోవడం మంచిదని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియాతో జరిగిన చివరి వన్డే అనంతరం ఐసీసీ తన ట్విటర్ అకౌంట్లో ఈ మేరకు పోస్ట్ చేసింది. ఆ మ్యాచ్లో కేదార్ జాదవ్ వేసిన ఓవర్లో బంతి నీషమ్ ప్యాడ్స్ తగలగా.. భారత ఆటగాళ్లంతా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేస్తున్న సమయంలో అందరూ అంపైర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ బిజీగా ఉండగా.. బంతిని అందుకున్న ధోని అప్పీల్ చేస్తూనే నీషమ్ను రనౌట్ చేశాడు. ధోని సమయస్ఫూర్తిని చూసి అందరూ ప్రశంసించారు.
ఇపుడు తాజాగా ధోనిపై ఐసీసీ మరో ట్వీట్ చేసింది. కివీస్తో చివరిదైన మూడో టీ20 ధోనికి 300వ టీ20 మ్యాచ్ కాగా పురస్కరించుకుని ఐసీసీ లిరిక్స్ రూపంలో ట్వీట్లు చేసింది. ఇంగ్లిష్ సింగర్, రైటర్ జాన్ లెనన్స్ క్లాసిస్ ఇమాజిన్ను ఆధారంగా చేసుకుని కొన్ని ట్వీట్లు చేసింది. ‘అంపైర్ లేని క్రికెట్ను ఊహించండి.. అన్ని మ్యాచ్లు ఏడాదంతా ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి. ధోని లేని క్రికెట్ ఎలా ఉంటుందో ఊహించండి.. ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది. మిమ్మల్ని స్టంప్ లేదా క్యాచ్ ఔట్ చేయడానికి ఎవరూ ఉండరు’ అంటూ ఐసీసీ లిరిక్స్ రూపంలో ట్వీట్లు రిలీజ్ చేసింది.